Punjab: మరోసారి కరోనా విజృంభణ... పంజాబ్ లో మార్చి 31 వరకు విద్యాసంస్థల మూసివేత

Punjab govt orders to close educational institutions
  • దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి
  • పంజాబ్ లోనూ పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య
  • స్కూళ్లు, కాలేజీలు మూసివేత
  • వైద్య, నర్సింగ్ కాలేజీలకు మినహాయింపు
  • రెండు వారాలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచన
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వైద్య, నర్సింగ్ కళాశాలలను అందుకు మినహాయించారు. కరోనా కట్టడి కోసం రానున్న 2 వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.

అటు, సినిమా హాళ్లలో సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, షాపింగ్ మాల్స్ లో ఏ సమయంలోనైనా 100 మందికి మించి ఉండరాదని సర్కారు నిబంధనలు విధించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పదకొండు జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడమే కాకుండా, అదనంగా మరో రెండు గంటల పాటు పొడిగించాలని నిర్ణయించింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మంది వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రజలు గుమికూడడంపై ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
Punjab
Educational Institutions
Corona Virus
India

More Telugu News