VH: జేసీ దివాకర్ రెడ్డి తన రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలి: వీహెచ్ వ్యాఖ్యలు

  • హైదరాబాదులో జేసీ సందడి
  • సీఎల్పీకి విచ్చేసిన వైనం
  • తాజా పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు
  • జానారెడ్డి ఓడిపోతాడని జోస్యం
  • ఆ మాట చెప్పడానికి జేసీ ఎవడన్న వీహెచ్
  • కార్యకర్తలే బుద్ధి చెబుతారని వార్నింగ్
VH warns JC Diwakar Reddy do politics in Andhra instead of Telangana

గత రెండ్రోజులుగా ఏపీ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాదులో సందడి చేస్తున్నారు. తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరులను కలుస్తూ అన్ని అంశాలపైనా తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు.

 జేసీ దివాకర్ రెడ్డి తన రాజకీయాలేవో ఆంధ్రాలో చేసుకోవాలని హితవు పలికారు. సీఎల్పీలో అడుగుపెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేంటని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయం అని చెప్పడానికి జేసీ ఎవడని మండిపడ్డారు.

జేసీ వైఖరి చూస్తుంటే కేసీఆర్ కోవర్ట్ అనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అంత గొప్ప నాయకుడే అయితే జేసీ తన రాజకీయ బలాన్ని అనంతపురంలోనో, రాయలసీమలోనూ చూపించుకోవాలని, చేతనైతే జగన్ పై పోరాడాలని వీహెచ్ పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

More Telugu News