Kailash Vijayvargiya: మమతా బెనర్జీ కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారు: కైలాశ్ విజయవర్గీయ

  • ఓటమి భయంతోనే మమత నియోజకవర్గం మారారు
  • ఒపీనియన్ పోల్స్ గతంలో తప్పయ్యాయి
  • బీజేపీ 250 సీట్లు గెలవడం ఖాయం
Mamata Banerjee will loose by 50000 votes says Kailash Vijayvargiya

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలపై యావత్ దేశం దృష్టి సారించింది. బీజేపీ, టీఎంసీలు నువ్వా, నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారాన్ని చేపట్టబోయేది తామేనని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన సువేందు అధికారిపై నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే ఆమె తన సొంత నియోజకవర్గం భవానీపూర్ లో పోటీ చేయకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారని... అయినప్పటికీ నందిగ్రామ్ లో కూడా ఆమె కనీసం 50 వేల మెజార్టీతో ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు.

మమతకు చెందిన టీఎంసీనే గెలవబోతోందంటూ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయడాన్ని ఆయన తోసిపుచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే వస్తాయని అప్పట్లో చెప్పారని... కానీ, బీజేపీ 18 సీట్లను గెలుచుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోందని అన్నారు. లోక్ సభ ఫలితాల ఆధారంగా లెక్కిస్తే... బీజేపీ 250 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News