Raghu Rama Krishna Raju: జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: రఘురామకృష్ణరాజు

  • చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీకి భయం ఎందుకు?
  • మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు భయపడుతున్నారు
  • నా నియోజకవర్గంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
Jagan has to change his attitude says Raghu Rama Krishna Raju

రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్లడం సహజమని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... అలాంటప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా  తీరు మార్చుకోవాలని... ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఒక ఎంపీగా ఉన్న తాను తన నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనపై వైసీపీ నేతలు కేసులు పెట్టారని, ఆ కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని కోరానని చెప్పారు. వాటిపై కోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తానని అన్నారు.

More Telugu News