Medaram: ప్రారంభమైన సమ్మక్మ-సారలమ్మ మినీ జాతర.. పోటెత్తుతున్న భక్తులు

  • ఈ నెల 27 వరకు జరగనున్న జాతర
  • వరంగల్, హన్మకొండ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
  • రూ. 1.52 కోట్లతో భక్తులకు సౌకర్యాల కల్పన
Medaram Sammakka Festival Begins

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేడు ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకు మేడారం జాతర వైభవంగా జరగనుండగా ఆ తర్వాత వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 27 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడుకకు కూడా వేలాదిమంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు.

ఇక ఈసారి 20 లక్షలమందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, వనదేవత దర్శనానికి భక్తులు ఇప్పటికే క్యూ కట్టారు. భక్తులతో గద్దెల ప్రాంతం, జంపన్న వాగు కొత్త కళను సంతరించుకున్నాయి.

మేడారం మినీ జాతర కోసం ప్రభుత్వం రూ.1.52 కోట్లు వెచ్చించింది. అమ్మల గద్దెల ప్రాంగణంలో ఇప్పటికే చలువు పందిళ్లు వేశారు. భక్తుల స్నానాల కోసం జంపన్నవాగులో నల్లాలు అమర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం పది మినీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వరంగల్, హన్మకొండ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

More Telugu News