Karnataka: ప్లీజ్ మీరైనా జోక్యం చేసుకోండి: కర్ణాటక ఆంక్షలపై ప్రధానికి కేరళ సీఎం లేఖ

Kerala CM writes letter to PM Modi on Karnataka Restrictions
  • కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా కర్ణాటక ఆంక్షలు
  • విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సీఎం
  • అలాంటిదేమీ లేదన్న కర్ణాటక మంత్రి
కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన పొరుగు రాష్ట్రం కర్ణాటక ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చే వాహనాలపై నిషేధం విధించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలతో వెళ్లే ట్రక్కు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కర్ణాటక ఆంక్షలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, నిత్యావసరాల సరఫరాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అందులో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

పినరయి లేఖపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి కె సుధాకరన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేరళ సీఎం పేర్కొన్నట్టుగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిషేధించలేదని తెలిపారు. కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారికి 72 గంటల క్రితం చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేశామని అన్నారు. అయితే, ఈ నిబంధన కాస్తంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్నారు.
Karnataka
Kerala
Travel Restrictions
Corona Virus

More Telugu News