తిరుపతిలో 1971 భారత్-పాక్ యుద్ధవీరుడ్ని సత్కరించిన సీఎం జగన్

CM Jagan felicitates retired general Venugopal in Tirupathi
  • తిరుపతిలో స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమాలు
  • ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన సీఎం
  • రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం
  • రిటైర్డ్ జనరల్ వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన జగన్
తిరుపతిలో స్వర్నిమ్ విజయ్ వర్ష్ పేరిట భారత సైన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నేడు సీఎం జగన్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ విమోచన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగి 50 ఏళ్లయిన సందర్భంగా సైన్యం ఈ ఉత్సవాలు జరుపుతోంది. గత సంవత్సరం డిసెంబరు 16న ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద వెలిగించిన విజయ జ్వాల నిన్న తిరుపతికి చేరుకుంది. ఆ జ్వాలను నేడు సీఎం జగన్ అందుకున్నారు.

సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ నివాసానికి విచ్చేశారు. 95 ఏళ్ల ఆ రిటైర్డ్ జనరల్ ను సీఎం జగన్ సత్కరించారు. అనంతరం తిరుపతి వైట్ హౌస్ లో ఆర్మీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో విశిష్ట సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పరమవిశిష్ట సేవా పతకం, మహావీరచక్ర వంటి పురస్కారాలు వరించాయి. వేణుగోపాల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

కాగా, ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి స్వాగతం పలికారు. ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన, చెవిరెడ్డి తదితరులు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Go Back to Shorts
Jagan
Rtd Genral Venugopal
Felicitation
Tirupati
Swarnim Vijay Varsh

More Telugu News