India: అనుకున్న సమయం కన్నా ముందుగానే సరిహద్దులు ఖాళీ... వెనుదిరుగుతున్న భారత్, చైనా సైన్యం!

  • సైన్యాన్ని మళ్లించాలని ఒప్పందం
  • లిఖిత పూర్వక డీల్ పై సంతకాలు
  • 20 నాటికి తొలి దశ తరలింపు పూర్తి
India and China Army Disengagement from Borders

ఇండియా, చైనా సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కు తరలించాలని, పరస్పరం ఈ దిశగా అడుగులు వేయాలని రెండు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయించిన నేపథ్యంలో సైనికుల తరలింపు కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఈ ప్రక్రియ అనుకున్న సమయంకన్నా, ముందుగా, వేగంగా సాగుతోందని సమాచారం. సరిహద్దుల నుంచి సైనికులు వెనక్కు మళ్లుతున్న అంశాన్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి సైన్యం తొలగింపు ప్రక్రియ సాగుతోందని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్యా ఈ దిశగా లిఖితపూర్వక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

"సైన్యాన్ని వెనక్కు తీసుకునే ప్రక్రియ రెండు వైపులా సాగుతోంది. ఇది అనుకున్న సమయం కన్నా ముందుగానే జరుగుతోంది. ఈ నెల 20 నాటికి తొలి దశ తరలింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం" అని సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో చైనా సైనికాధికారులతో జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిన వేళ, మలి విడత చర్చల్లో లిఖిత పూర్వక డీల్ కుదరాల్సిందేనని ఇండియా పట్టుబడింది.

సరిహద్దుల్లో మోహరించిన హెలికాప్టర్లు, నిఘా డ్రోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, సైన్యాన్ని సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లిపోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఒప్పందం కుదిరిన 48 గంటల్లోగా సైనికుల తరలింపు ప్రారంభం కావాలని డీల్ కుదరగా, పెట్రోలింగ్ పాయింట్స్ 15, 17, హాట్ స్ప్రింగ్స్ తో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన గోగ్రా ప్రాంతం నుంచి కూడా సైనికుల తరలింపు ప్రారంభమైందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

More Telugu News