Goa: గోవాలో ఇదో కొత్త ట్రెండు!

  • మందీమార్బలంతో గోవా వస్తున్న పర్యాటకులు
  • హోటళ్లలో కంటే ఫ్లాట్లలో బస చేసేందుకు మొగ్గు
  • సమీప గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం ఎంక్వైరీలు
  • తీర ప్రాంత గ్రామాలకు విపరీతమైన డిమాండ్
New trend in Goa

భారత్ లో పాశ్చాత్య సంస్కృతిని చూడాలంటే గోవా వెళ్లాల్సిందే. ఒకప్పుడు పోర్చుగీసు వారికి వలస ప్రాంతంగా ఉన్న గోవా భారత్ లో విదేశీయులను ఎక్కువగా ఆకర్షించే పర్యాటక ప్రాంతం. దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు గోవా వస్తుంటారు. సాధారణంగా టూరిస్టు స్పాట్లకు వెళ్లే పర్యాటకులు హోటళ్లలో బస చేస్తుంటారు. గోవాలో కూడా టూరిస్టుల కోసం ఎన్నో హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి.

అయితే ఇటీవల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. హోటళ్లలో ఉండడం కంటే గోవాలోని గ్రామీణ ప్రాంతాల్లో అద్దెకు ఇచ్చే ఇళ్లలో దిగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా, బీచ్ ఒడ్డునే ఉండే గ్రామాల్లో ఉన్న ఇళ్లకు బాగా గిరాకీ పెరిగిందట. ఇంటిలో నుంచే బీచ్ ను చూస్తూ మైమరిచిపోయేందుకు పర్యాటకులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తర గోవాలోని ఆరంబోల్ ప్రాంతంలో ఈ ట్రెండ్ అధికంగా కనిపిస్తోంది. టూరిస్టులకు అద్దెకు ఇచ్చే ఇళ్ల కోసం ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎంక్వైరీ చేయడం ఎక్కువైంది.

ఇటీవల కాలంలో సంపన్నులు తమ కుటుంబ సభ్యులతో పాటు గోవా వచ్చేటప్పుడు తమ వంటవాళ్లను, పనివాళ్లను కూడా తీసుకువస్తున్నారని, వారు హోటల్ లో దిగే కంటే ఏదైనా ఫ్లాట్ లో అద్దెకు ఉండేందుకు ఇష్టపడుతున్నారని ఫస్ట్ క్లాస్ హాలీడేస్ సంస్థ డైరెక్టర్ ఆతిష్ ఫెర్నాండెజ్ తెలిపారు.

More Telugu News