Piler: రైలుకింద పడి ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత వెంకట రమణారెడ్డి ఆత్మహత్య

  • ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న రమణారెడ్డి
  • కాలేజీ ముగిసిన తర్వాత కారులో కొడిదిపల్లె రైల్వే గేటు వద్దకు
  • తినడానికి ఏమైనా తీసుకురావాలని డ్రైవర్‌ను పంపి ఆత్మహత్య
MJR Educational Institutions head suicide in piler

చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి (52) నిన్న సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బోడుమల్లెవారి పల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు-కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు.

నిన్న సాయంత్రం కాలేజీ ముగిసిన అనంతరం కారులో కొడిదిపల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైలు వస్తుండడంతో సిబ్బంది గేటు వేశారు. దీంతో తినేందుకు ఏమైనా తీసుకురావాలంటూ డ్రైవర్‌ను పంపిన రమణారెడ్డి.. కారు దిగి ట్రాక్ పక్క నుంచి పీలేరు దిశగా నడవడం మొదలుపెట్టారు. కొంతదూరం వెళ్లాక వెనక నుంచి రైలు వస్తున్న విషయాన్ని గమనించి అకస్మాత్తుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

More Telugu News