Shruti Hassan: వాళ్లిద్దరిలో మెగాస్టార్ సరసన ఛాన్స్ ఎవరికి?

  • బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిత్రం 
  • మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం
  • కథానాయికగా శ్రుతి లేదా రకుల్?
  • వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్  
Shruti Hassan opposite Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఆయన.. ఆ వెంటనే చేసే మరో రెండు చిత్రాలను ఓకే చేశారు. మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్ ఒకటి కాగా, 'వేదాళం' తమిళ రీమేక్ మరొకటి. వీటిలో 'లూసిఫర్'కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. 'వేదాళం'కి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరోపక్క, తాజాగా చిరంజీవి మరో చిత్రానికి కూడా ఓకే చెప్పారు. దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) చెప్పిన కథ సంతృప్తికరంగా రావడంతో  ఆయన పచ్చజెండా ఊపేశారు. ఈ విషయాన్ని ఇటీవల తానే వెల్లడించారు కూడా. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది.

అదేమిటంటే, ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ నటించే అవకాశం ఉందట. వీరిద్దరిలోనూ ఒకరి ఎంపిక త్వరలో ఖరారవుతుందని తెలుస్తోంది. మే నెల నుంచి దీని షూటింగ్ ప్రారంభిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ తో కలసి చక్రవర్తి ('పంతం' ఫేమ్) మాటలు రాస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చేలా నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News