హైదరాబాదులో 40 ఏళ్ల వృక్షాన్ని నేలకూల్చిన వ్యక్తికి రూ.62 వేల జరిమానా

Huge fine for Hyderabad man who cut down age old tree
  • కొత్త ఇంటికి అడ్డుగా ఉందని చెట్టు నరికివేత
  • ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కొమ్మలు దహనం
  • గమనించిన ఎనిమిదో తరగతి విద్యార్థి
  • అటవీశాఖ అధికారులకు సమాచారం
తెలంగాణలో వృక్ష సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో చెట్లను నరికివేస్తుండడంపై అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాదులోని సైదాబాద్ లో 40 ఏళ్ల వయసున్న వేపచెట్టును ఓ వ్యక్తి నరికివేయగా, అతడికి అధికారులు రూ.62,075 జరిమానా వడ్డించారు. ఓ ఎనిమిది తరగతి విద్యార్థి అందించిన సమాచారంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ మేరకు చర్య తీసుకున్నారు.

నాలుగు దశాబ్దాల వయసున్న ఆ వృక్షాన్ని నరికివేసిన వ్యక్తిని జి.సంతోష్ రెడ్డిగా గుర్తించారు. తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అడ్డుగా ఉందన్న కారణంతో వేపచెట్టును నరికివేశాడు. చెట్టు నరికివేత ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కొమ్మలన్నీ దహనం చేసే ప్రయత్నం చేశాడు. అయితే, ఇది గమనించిన ఎనిమిదో తరగతి విద్యార్థి అటవీశాఖ టోల్ ఫ్రీ నెంబరు (1800 4255364)కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అటవీశాఖ అధికారులు సంతోష్ రెడ్డి చెట్టు నరికివేతకు పాల్పడ్డాడని నిర్ధారించి భారీ జరిమానా విధించారు. సమాచారం అందించిన బాలుడ్ని అటవీశాఖ అధికారులు అభినందించారు.
Go Back to Shorts
Neem Tree
Cut Down
Fine
Hyderabad
Telangana

More Telugu News