Punjab: వారి ఆగ్రహాన్ని తట్టుకోలేకున్నాం: రైతులపై బీజేపీ నేతలు!

  • మరో వారంలో పంజాబ్ లో స్థానిక ఎన్నికలు
  • బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి
  • ప్రచారం చేయలేకపోతున్నామంటున్న నేతలు
Farmers Angry on BJP Leaders

రైతుల నిరసనల సెగ తమకు తగులుతోందని హర్యానా, పంజాబ్ కు చెందిన బీజేపీ నేతలు ఇప్పుడు వాపోతున్నారు. వారు తమను తరుముతున్నారని, తాము ఎక్కడా తిరగలేకపోతున్నామని, మరో వారం రోజుల్లో పంజాబ్ లో స్థానిక ఎన్నికలు జరగాల్సిన తరుణంలో, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బీజేపీకి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయని జలంధర్ కు చెందిన పార్టీ నేత రమేశ్ శర్మ వాపోయారు.

2015లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అకాలీదళ్ తో కలిసి పోటీచేసిన బీజేపీ, స్థానిక ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ దఫా మాత్రం ఆ పరిస్థితులు లేవని, మూడింట రెండు వంతుల స్థానాల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరని, వారిని వెతుక్కునేందుకు కూడా తమ వద్ద సమయం లేదని ఆయన అన్నారు. గతంలోనూ తమ ఇంటివారు ధర్నాలకని వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి పోయిన ఘటనలు ఇక్కడి ప్రజలు, మహిళలకు తెలుసని, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరని శర్మ తెలిపారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని దాదాపు 3 నెలల నుంచి రైతులు ధర్నాలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ చుట్టుపక్కలా ఉన్న అన్ని సరిహద్దుల వద్దా మకాం వేసిన పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు దిగ్బంధించగా, రాజధానికి సామాన్య పౌరుల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతుల నిరసనల మధ్యే పంజాబ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో, బీజేపీ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతుల ఆగ్రహం పార్టీపై పడి తీరుతుందని, ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని, తమ వాహనాలపై బీజేపీ జెండా కనిపించినా, ప్రజలు సహించడం లేదని ఆ పార్టీ మరో నేత మల్వీందర్ సింగ్ కాంగ్ వ్యాఖ్యానించారు. అసలు తాము ఇంటి నుంచి బయటకు వెళితేనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని, ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించగలమని వాపోయారు.

More Telugu News