దేశంలో అతి పిన్నవయసు మహిళా పైలెట్ గా కశ్మీర్ అమ్మాయి రికార్డు
- విమానాలు నడుపుతున్న 25 ఏళ్ల ఆయేషా అజీజ్
- 15 ఏళ్లకే ఫ్లయింగ్ లైసెన్స్
- 16 ఏటనే రష్యాలో మిగ్-29 ద్వారా శిక్షణ
- 2017లో కమర్షియల్ లైసెన్స్
తన ఘనతపై ఆయేషా మీడియాతో మాట్లాడుతూ, తనకు బాల్యం నుంచి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టమని వెల్లడించారు. ముఖ్యంగా గగనవిహారం అంటే పిచ్చి అని తెలిపారు. ఎంతో మంది ప్రజలను కలుసుకునే వీలుంటుందని, ఈ కారణాలతోనే తాను పైలెట్ అయ్యానని ఆయేషా వివరించారు. ఇది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే సాధారణ ఉద్యోగం కాదని, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని, అక్కడ భిన్న వాతావరణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిన్నింటికి తాను సిద్ధమేనని ఆయేషా తెలిపారు.
కశ్మీరీ అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నారని, ముఖ్యంగా విద్యారంగంలో వారు ప్రతిభ చూపుతున్నారని వెల్లడించారు. ఇప్పటితరం కశ్మీర్ మహిళల్లో సగం మంది మాస్టర్స్ డిగ్రీ, లేక డాక్టరేట్ చేస్తున్నవారేనని వివరించారు.