Keerti Suresh: కీర్తి సురేశ్ కి అరుదైన గుర్తింపు.. ఆనందాన్ని వ్యక్తం చేసిన ముద్దుగుమ్మ

  • 'మహానటి'తో మంచి నటిగా కీర్తి సురేశ్ కి పేరు 
  • ప్రస్తుతం మహేశ్ సరసన నటిస్తున్న కథానాయిక
  • ఫోర్బ్స్ మేగజీన్ 30 మంది జాబితాలో చోటు
  • ఇది తనకు చాలా పెద్ద గౌరవమన్న కీర్తి సురేశ్
Keerti Suresh has been ranked by Forbs magazine

కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే మలయాళ భామ కీర్తి సురేశ్ కి మంచి సినిమాలు పడ్డాయి. వాటిని తాను సద్వినియోగం చేసుకుని అనతికాలంలోనే మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో తను చేసిన 'మహానటి' సినిమా ఆమెకు ఎంతో పేరును తెచ్చిపెట్టింది. నాటి మహానటి సావిత్రి పాత్రలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి అవార్డులు సైతం అందుకుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు పలు సినిమాలలో కథానాయికగా నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తూ, తన స్థాయిని మరింత పెంచుకుంది.

ఇప్పుడీ ముద్దుగుమ్మకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ఆమె ప్రతిభను గుర్తించింది. ఈ ఏడాది వినోద రంగంలో 30 ఏళ్ల లోపు వారి నుంచి 30 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తూ, ఫోర్బ్స్ మేగజీన్ ఓ జాబితాను ప్రకటించింది. అందులో కీర్తి సురేశ్ కి 28వ ర్యాంకును ఇచ్చింది.

దీంతో ఈ అందాలతారకు ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకోగలగడం చాలా పెద్ద గౌరవంగా ఉందని చెబుతూ కీర్తి సురేశ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే, తనకీ గౌరవాన్ని కట్టబెట్టిన ఫోర్బ్స్ మేగజీన్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ గుర్తింపు కెరీర్ పరంగా కీర్తి సురేశ్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పచ్చు.

More Telugu News