Bode Prasad: పట్టాభిపై దాడి చేయించింది కొడాలి నానే.. 10 రోజుల క్రితం వల్లభనేని వంశీ ఇంట్లో మీటింగ్ పెట్టాడు: బోడె ప్రసాద్

  • కొక్కిలిగడ్డ జాన్, పండుతో సహా 10 మంది మీటింగ్ లో పాల్గొన్నారు
  • పట్టాభిపై దాడి చేయాలని ఆ మీటింగ్ లో ప్లాన్ వేశారు
  • ఆ మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తి నాకు సమాచారమిచ్చాడు
Kodali Nani hold meeting in Vallabhaneni Vamsi house to discuss about attack on Pattabhi says Bode Prasad

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడితో కలకలం రేగింది. ఇంటి నుంచి బయలు దేరిన కాసేపటికే దుండగులు ఆయనపై దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైసీపీనే ఈ దాడికి పాల్పడినట్టు టీడీపీ ఆరోపిస్తోంది. గత రెండు నెలల్లో పట్టాభిపై దాడి జరగడం ఇది రెండోసారి.

మరోవైపు ఈ దాడిపై టీడీపీ నేత బోడె ప్రసాద్ మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పది రోజుల క్రితం మంత్రి కొడాలి నాని విజయవాడలోని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కొక్కిలిగడ్డ జాన్, పండు సహా మరో పది మందితో మీటింగ్ పెట్టాడని... పట్టాభిపై దాడి చేయాలని ఆ సమావేశంలో ప్లాన్ వేశారని చెప్పారు.

ఈ విషయాన్ని ఆ మీటింగ్ లో పాల్గొన్న ఒక వ్యక్తి తనకు సమాచారమిచ్చాడని, వెంటనే పట్టాభిని తాను అప్రమత్తం చేశానని, హత్య చేసే అవకాశం కూడా ఉందని చెప్పానని తెలిపారు. ఇదే సమయంలో కొడాలి నానికి బోడె ప్రసాద్ సవాల్ విసిరారు. ఆడతనంతో వచ్చి దాడి చేయడం కాదని, దమ్ముంటే పది మంది ఉన్నప్పుడు వచ్చి దాడి చేయాలని అన్నారు. ఈ దాడికి కొడాలి నానే కారణమని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను హింస ద్వారా ప్రజలను భయపెట్టి అడ్డుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని విమర్శించారు.

More Telugu News