Chandrababu: మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

YSRCP complains against chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడంపై వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి సీహెచ్ సాయిరామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మేనిఫెస్టోను విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని... చర్యలు తీసుకోకపోతే... చంద్రబాబు పక్షపాతిగా ఉన్నారనే ఆరోపణలు నిజమవుతాయని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలను తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... దానిని కాదని ఎన్నికలను నిర్వహించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణిస్తున్న మీరు... చంద్రబాబు మీద, ఆయన పార్టీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికను నిన్న చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పల్లె ప్రగతికి పంచ సూత్రాలు పేరుతో ఈ ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నా... తెలుగుదేశం మద్దతుదారులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. టీడీపీ మద్దతుదారులు గెలిస్తే గ్రామాల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పారు.
Chandrababu
Telugudesam
YSRCP
SEC

More Telugu News