ఢిల్లీ ఘటన: 200 మంది అరెస్ట్.. 25 క్రిమినల్ కేసులు
- ఎర్రకోట ముట్టడి, ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్రం సీరియస్
- ఎఫ్ఐఆర్లో మేధాపాట్కర్, రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్ పేర్లు
- హర్యానాలో 2 వేల మందిపై కేసు నమోదు
ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడిలో హింసకు దారి తీసిన ఘటనపై దృష్టిసారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొందరు నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం నాటి ఘటనలో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయపడినట్టు పేర్కొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ, ఎర్రకోట ముట్టడితో సమస్యాత్మకంగా మారిన ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు.
మరోవైపు, రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బారికేడ్లను బద్దలుగొట్టేందుకు ప్రయత్నించారంటూ 2 వేల మందిపై హర్యానాలోని పల్వాల్ జిల్లాలో కేసు నమోదైంది.