చిలీ తీరంలో భారీ భూకంపం... రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత!

7 points Magnitrude Earth Quake Near Cheli
  • తెల్లవారుజామున 5 గంటలకు భూకంపం
  • సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
  • అంతకుముందు శాంటియాగోలోనూ ప్రకంపనలు
ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో (భారత కాలమానం) అంటార్కిటికా తీరంలోని చిలియన్ బేస్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో, ఆ వెంటనే చిలీ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈక్వెడార్ ఫ్రయ్ బేస్ లో సముద్ర తీరంలో భారీ ఎత్తున అలలు రావచ్చని అంచనా వేశారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8.36లకు దేశానికి తూర్పున 210 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించిందని చిలీ నేషనల్ ఎమర్జెన్సీ స్పష్టం చేసింది. వెంటనే ప్రజలు, టూరిస్టులు సముద్ర తీర ప్రాంతాన్ని ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది.

సునామీ సంభవించే ప్రాంతంలో చిలీ దేశపు అతిపెద్ద వాయుసేన స్థావరంతో పాటు ఓ గ్రామం, ఆసుపత్రి, స్కూలు, బ్యాంక్, పోస్టాఫీస్ తదితరాలు ఉండగా, అధికారులు హుటాహుటిన వారిని ఖాళీ చేయించారు. ఈ ప్రాంతంలో వేసవి కాలంలో దాదాపు 150 మంది, శీతాకాలంలో 80 మంది వరకూ మాత్రమే ఉంటారని తెలుస్తోంది.

ఇక ఇదే సమయంలో శాంటియాగో సమీపంలో 5.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్టుగా సమాచారం తెలియలేదు. ప్రపంచంలోనే భూకంపాలు అత్యధికంగా సంభవించే దేశాల్లో ఒకటైన చిలీలో 2010, ఫిబ్రవరి 27న రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో భూకంపం రాగా, దాదాపు 500 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Cheli
EarthQuake
Tsunami
Warning

More Telugu News