ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు

AP Government extends suspension on AB Venkateswararao
ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని, భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సర్కారు కొంతకాలం కిందట సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పొడిగింపు గతేడాది ఆగస్టు మాసం నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

కాగా, వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించింది. 2017-18 నాటి కొనుగోళ్ల వ్యవహారాన్ని అందుకు కారణంగా చూపింది. భద్రతా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయెల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ కు దక్కేలా చేశాడని, ఆ సంస్థకు తన కుమారుడు చేతన్ సాయికృష్ణ భారత్ లో ప్రతినిధిగా ఉన్న విషయం దాచాడని ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని, అందుకోసం టెండర్ల ప్రక్రియను మార్చివేశారని ఆరోపణలు వచ్చాయి.
Go Back to Shorts
AB Venkateswara Rao
Suspension
Extension
Intelligence
Andhra Pradesh
YSRCP

More Telugu News