Gram Panchayat Elections: ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే జైలే.. కొత్త చట్టాన్ని తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP govt brings new act to conduct panchayat elections
  • రూ.10 వేల జరిమానా.. మూడేళ్ల జైలు శిక్ష
  • సర్పంచి, ఉప సర్పంచిలను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్లకు
  • 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి
పంచాయతీ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి జరిమానాతో పాటు జైటు శిక్షను విధించేందుకు ఏపీ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణల పేరిట గత ఏడాది జనవరిలోనే వైసీపీ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. వీటికి సంబంధించి గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించినా మండలిలో చుక్కెదురైంది. దీన్ని రెండోసారి శాసనసభ ఆమోదించినా మండలిలో మరోసారి  తిరస్కరణ ఎదురైంది. అయితే రెండోసారి మండలిలో వ్యతిరేకించినా చట్టం చేయవచ్చనే నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపరి కార్యాచరణను పూర్తి చేసింది.

ఈ చట్టం ప్రకారం ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆ తర్వాత రుజువైతే... అలాంటి సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రూ. 10 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్షను విధించనున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను 16 రోజుల్లో పూర్తి చేయాలి.

అంతేకాదు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచి, ఉప సర్పంచులను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంటుంది. అంటు వ్యాధులు ప్రబలినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు నిబంధనలకు లోబడి అత్యవసర నిధులను ఖర్చు చేసే అధికారాన్ని సర్పంచులకు కల్పించారు.
Gram Panchayat Elections
Andhra Pradesh
New Act

More Telugu News