Centre: ఎవరూ వెనక్కి తగ్గట్లేదు... కేంద్రం, రైతుల చర్చలు మరోసారి విఫలం!

  • ఇవాళ ఎనిమిదో పర్యాయం చర్చలు
  • 41 రైతు సంఘాలతో కేంద్రమంత్రుల సమావేశం
  • వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న రైతులు
  • ఆ ఒక్కటి తప్ప అంటూ మంత్రుల దృఢవైఖరి
  • ఈ నెల 15న మళ్లీ సమావేశామవ్వాలని నిర్ణయం
Centre and Farmers discussions fails again

జాతీయ వ్యవసాయ చట్టాలపై రైతులకు నచ్చచెప్పేందుకు కేంద్రం మరోసారి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఎనిమిదో పర్యాయం కేంద్రం, రైతులు ఢిల్లీలో జరిపిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం తేలకుండానే ముగిశాయి. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో తాజా చర్చలు కూడా నిష్ఫలం అయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 15న మరోసారి సమావేశమవ్వాలని కేంద్రమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు.

ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఇతర మంత్రులు పియూష్ గోయల్, సోం ప్రకాశ్... 41 రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చర్చలు ప్రారంభమైన కాసేపటికే ఫలితం ఎలా ఉండబోతుందన్నది స్పష్టమైంది. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టగా, రద్దు చేసే ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రులు స్పష్టం చేశారు.

అయితే, రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లి అనుకూల తీర్పుతో వస్తే చట్టాలను వెనక్కితీసుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కానీ సుప్రీంకోర్టు చట్టాల అమలును స్వాగతిస్తే మాత్రం రైతులు నిరసనల నుంచి తప్పుకోవాల్సిందేనని కేంద్రమంత్రులు కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, రైతులు తమ పట్టు విడవకుండా చట్టాలను రద్దు చేసేవరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారని, సుప్రీంకు వెళితే ఎంతో సమయం పడుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడైంది.

More Telugu News