Earth: భూమి వేగం పెరిగింది.. సమయంలో కోత పడింది!

  • 2020లో త్వరగా గడిచిన 28 రోజులు
  • రోజుకు సగటున 0.05 మిల్లీ సెకన్ల లోటు
  • జులైలో రికార్డ్ స్థాయిలో 1.4602 మిల్లీ సెకన్ల తగ్గుదల
  • టైం నుంచి ఒక లీప్ సెకన్ ను తీసేయాలన్న చర్చ
Earth is whipping around quicker than it has in a half century

కాలచక్రం రేసుగుర్రంలా దూసుకెళ్లిపోతోంది.. భూమి వేగం పుంజుకుంది.. మన కాలంలో ఓ సెకనును లాగేసుకోబోతోంది. అవును, నమ్మబుద్ధి కాకపోయినా ఇది అక్షరాలా నిజం. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా.. భూమి తిరిగే వేగం పెరిగింది. కరోనాతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన 2020 సంవత్సరం.. కాలాన్నీ తికమకపెట్టింది. ఆ ఏడాది 28 రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి.

ఫ్రాన్స్ లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐఈఆర్ఎస్), బ్రిటన్ లోని నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ సైంటిస్టుల ప్రకారం భూమి వేగం పెరగడం వల్ల సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్ల టైం తగ్గిపోయింది. మొత్తం ఏడాదికి లెక్కిస్తే అది 19 మిల్లీ సెకన్లు. చూడడానికి లెక్క చిన్నగానే కనిపించినా.. ఆ కొద్ది టైంలోనే భూమి కొన్ని వేల కిలోమీటర్లను చుట్టేసి రాగలదు. అందుకే ఇప్పుడు తొలిసారిగా ఒక్క లీప్ సెకన్ ను కాలం నుంచి తీసేయాలని భావిస్తున్నారు.

మామూలుగా రోజులో 86,400 సెకన్లుంటాయి. అయితే, గత ఏడాది జులైలో అత్యధికంగా 1.4602 మిల్లీ సెకన్ల టైం తగ్గి రికార్డ్ సృష్టించింది. అది 2005 జులై 5న నమోదైన 1.0516 మిల్లీ సెకన్ల లోటు టైం కన్నా ఎక్కువ కావడం గమనార్హం. కాగా, లీప్ సెకన్ ను ఇప్పటిదాకా 28 సార్లు టైంకు కలపాల్సి వచ్చింది. చివరిసారిగా 2016 డిసెంబర్ 31న కలిపారు. ఆ రోజు 23 గంటల 59 నిమిషాల 59 సెకన్ల టైం మాత్రమే నమోదు కావడంతో ఒక క్షణాన్ని కలిపారు.

అయితే, ఇప్పుడు ఓ సెకన్ ను తీసేయాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవడం చాలా తొందరపాటే అవుతుందని, మున్ముందు భూమి వేగం పెరిగితే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ భౌతిక శాస్త్రవేత్త పీటర్ విబ్బర్లీ చెప్పారు. లీప్ సెకన్లను తీసేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోందని, ఒకవేళ ఇప్పుడు ఓ లీప్ సెకన్ ను టైం నుంచి తీసేస్తే అది మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.

ఏంటీ లీప్ సెకన్?

మామూలుగా మనకు ఓ సంవత్సరంలో 365 రోజులు వుంటాయన్న సంగతి తెలిసిందే. కానీ, పావు రోజు ఎక్కువే ఉంటుంది. దానిని ఓ సంవత్సరంలో లెక్కించడం కష్టం కాబట్టి.. నాలుగేండ్లకు ఓ రోజుగా లెక్కించి లీప్ సంవత్సరాన్ని పెట్టారు. అంటే ఆ ఏడాది 366 రోజులుంటాయి.. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. లీప్ సెకన్ కూడా దాదాపు అంతే. భూమి తిరిగే వేగాన్ని బట్టి ఒక క్షణాన్ని కాలంలో సర్దుబాటు చేస్తుంటారు. వేగంలో మార్పుల వల్ల సౌర కాల వ్యవస్థ, మన ఆటమిక్ కాల వ్యవస్థల (కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం) మధ్య తేడాలొస్తుంటాయి.

కాబట్టి ఆ తేడాలను సమతుల్యం చేసేందుకు వేగం తగ్గితే ఓ సెకన్ ను కలుపుతారు. వేగం పెరిగితే.. ఓ క్షణాన్ని తీసేస్తుంటారు. అయితే, 1970 నుంచి ఇప్పటిదాకా 28 సార్లు కాలానికి ఓ లీప్ సెకన్ ను కలిపారు. తొలిసారిగా ఇప్పుడు ఆ లీప్ సెకన్ ను తీసేయాలని చర్చ జరుగుతోంది. అయితే, సాధారణంగా లీప్ సెకన్ ను కలపాలన్నా.. తీసేయాలన్నా ఆరు నెలల ముందే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. జూన్ లేదా డిసెంబర్ లో మాత్రమే లీప్ సెకన్ ను కలపడమో తీసేయడమో చేస్తారు.

అయితే, లీప్ సెకన్లను ఎత్తేయాలని చాలా మంది నిపుణులు తేల్చి చెబుతున్నారు. దాని వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. టైంలో మార్పుల వల్ల టెలీ కమ్యూనికేషన్స్, జీపీఎస్, సాఫ్ట్ వేర్, స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. గతంలో దాని వల్ల జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. ఆటమిక్ క్లాక్ ఆధారంగా అవన్నీ పనిచేస్తుంటాయని, దానికి తగ్గట్టే టైంను ఫిక్స్ చేస్తారని, కానీ, టైంలో మార్పులు చేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఒక లీప్ సెకన్ ను కలపడం వల్ల 2012 జూన్ 30న రెడ్డిట్, మొజిల్లా, ఖంటాస్, లైనక్స్ లో నడిచే మరికొన్ని సాఫ్ట్ వేర్లలో సమస్యలు తలెత్తాయి. 2003 నవంబర్ 28న మోటోరోలా ఫోన్లలోని జీపీఎస్ రిసీవర్లకు సిగ్నల్స్ అందక సాఫ్ట్ వేర్ లో సమస్యలొచ్చాయి. 2015 జూన్ 30న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ చేంజ్ సహా 11 ఎక్స్ చేంజ్ ల బాధ్యతలు చూసే ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ చేంజ్.. దాదాపు 61 నిమిషాలు మూత పడింది. అదే ఏడాది అదే రోజు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, పింట్రెస్ట్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ చానెళ్లకు 40 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.

More Telugu News