Farmers: సిద్ధంగా ఉండండి.. రేపు ట్రైలర్ చూపిస్తాం: కేంద్రాన్ని హెచ్చరించిన రైతులు

  • ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా రైతుల అడుగులు
  • 26న ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్
  • ఎల్లుండి 8వ విడత చర్చలు
  • రేపు ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ మార్చ్
Farmers to take out tractor march on Jan 7

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులు ఈసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు ఏడుసార్లు జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఇటు రైతులు కానీ, అటు ప్రభుత్వం కానీ మెట్టు దిగేందుకు అంగీకరించడం లేదు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తున్న రైతు సంఘాలు ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించాయి.

అయితే, అంతకంటే ముందు 7వ తేదీన (రేపు) ఢిల్లీ సరిహద్దులో నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్‌తో కేంద్రానికి ట్రైలర్ చూపిస్తామని హెచ్చరించాయి. రైతులు, కేంద్రం మధ్య ఎల్లుండి 8వ విడత చర్చలు జరగనుండగా, ఒక్క రోజు ముందు ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పిలుపునివ్వడం గమనార్హం. ఈ సందర్భంగా స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ల ర్యాలీకి ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న ‘దేశ్ జాగరణ్ అభియాన్’ రెండు వారాలపాటు కొనసాగుతుందన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో ‘ట్రాక్టర్ కిసాన్ పరేడ్’ నిర్వహించనున్నట్టు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ఇప్పటికే ప్రకటించారు. 23న ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్ల ఇళ్లవైపు రైతులు కవాతు నిర్వహిస్తారని తెలిపారు.

More Telugu News