COVAXIN: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చేందుకు అంత తొందర ఎందుకు?: బీబీసీ ప్రత్యేక కథనం

  • పలువురి అభిప్రాయాలను సేకరించిన బీబీసీ
  • మూడవ దశ రిపోర్ట్ లేకుండానే కొవాగ్జిన్ కు అనుమతి
  • అలా ఎలా ఇస్తారని ప్రశ్న
  • తమ వ్యాక్సిన్ సురక్షితమంటున్న భారత్ బయోటెక్
BBC Special Story on Bharath Bio Tech

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ రిపోర్ట్ వెల్లడి కాకుండానే, అత్యవసర అనుమతులు ఇవ్వడం పట్ల బీబీసీ, ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. ఇండియాలో వ్యాక్సిన్ అనుభవజ్ఞుడిగా విశేషమైన పేరు తెచ్చుకున్న డాక్టర్ గగన్ దీప్ కాంగ్ కామెంట్లను జోడించింది. ఆదివారం నాడు కొవాగ్జిన్ కు అత్యవసర వాడకానికి అనుమతి లభించిన సంగతి తెలిసిందే.

గడచిన 24 సంవత్సరాల్లో 16 వ్యాక్సిన్లను తయారు చేసి, 123 దేశాలకు భారత్ బయోటెక్ ఎగుమతి చేసిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే, ఇదే కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై పూర్తి సమాచారం లేకుండానే ఎందుకు అనుమతించాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

"ఏదైనా వ్యాక్సిన్ ను తయారు చేస్తే, దీర్ఘకాలం పాటు ట్రయల్స్ నిర్వహించాల్సి వస్తుంది. మూడు దశల్లో పరీక్షలు చేయాలి. ఎవరికీ, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లూ ఉండబోవని తేలిన తరువాతనే అనుమతులు ఇవ్వాలి" అని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు.

అయితే, క్లినికల్ ట్రయల్ మోడ్ లో దుష్ప్రభావాలు రాలేదని, రెండు దశల ట్రయల్స్ పూర్తి చేశామని భారత్ బయోటెక్ వెల్లడించిన నేపథ్యంలోనే వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ కమిటీతో పాటు, డీసీజీఏ సైతం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ నుంచి తమ వ్యాక్సిన్ సురక్షితమని రిపోర్టు వచ్చినంత మాత్రాన పూర్తి పరిశీలన లేకుండానే ఎలా అనుమతి ఇచ్చారని గగన్ దీప్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో తమ వద్ద 2 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు సిద్ధంగా ఉన్నాయని, తమకున్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుంచి డిసెంబర్ లోగా 70 కోట్ల డోస్ లను తయారు చేయగలమని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్ల కృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ వ్యాక్సిన్ 200 శాతం సురక్షితమని కూడా ఆయన వెల్లడించారని బీబీసీ గుర్తు చేసింది.  

భారత క్లినికల్ ట్రయల్స్ చట్టాల ప్రకారం, తాము అన్ని నిబంధనలనూ పాటించామని భారత్ బయోటెక్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూనే, కొవాగ్జిన్ ట్రయల్స్ సుమారు 24 వేల మందిపై జరిగాయనీ, అయితే, వారికి సంబంధించిన పూర్తి రిపోర్టును మాత్రం ఇండియా నియంత్రణ సంస్థలు పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది.

ఇండియాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ అభిప్రాయాలను తెలుపుతూ, "మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ లేకుండా ఎలా అనుమతి ఇచ్చారో తెలియడం లేదు. రెండు ట్రయల్స్ లోనే ఏ వ్యాక్సిన్ పనితీరుపై తుది అంచనాకు రాకూడదు. దీని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రజలకు ఇవ్వాలో వద్దో అన్నీ పరిశీలించాకే నిర్ణయించాలి" అని ఆయన వ్యాఖ్యానించారని బీబీసీ పేర్కొంది.

More Telugu News