Discussions: ఎటూ తేలని చర్చలు... తమ డిమాండ్లకు కట్టుబడిన రైతులు.. మెట్టు దిగని కేంద్రం!

  • రైతులు, కేంద్రం మధ్య ఇవాళ చర్చలు
  • మూడు చట్టాలు తొలగించాల్సిందేనన్న రైతులు
  • చట్టాల్లో మీకు నచ్చని అంశాలు చెప్పాలన్న కేంద్రం
  • ఎవరికి వారే పంతం
  • విఫలమైన చర్చలు
Discussions between Farmers and Centre ended as stalemate

జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశరాజధానిలో కొనసాగిస్తున్న నిరసనలు ఇప్పట్లో ఆగేట్టు లేవు. ఇవాళ మరో దఫా నిర్వహించిన చర్చలు ఫలితం తేలకుండానే ముగిశాయి. రైతులు తమ డిమాండ్లకు కట్టుబడి ఉండగా, కేంద్రం పాత పంథాలోనే వ్యవహరించడంతో తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ నెల 8న మళ్లీ సమావేశం కావాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

చర్చల సరళిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ, చర్చలు సఫలం కావాలంటూ రెండు వైపుల నుంచి ప్రయత్నాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆ మూడు వ్యవసాయ చట్టాల్లో సమస్యాత్మకంగా అనిపిస్తున్న అంశాలేమిటో ప్రస్తావించాలని రైతు సంఘాలను కోరుతున్నామని తెలిపారు. అటు, కేంద్రం రైతుల నమ్మకాన్ని కోల్పోయిందన్న వార్తలను ఆయన ఖండించారు. తమపై వారికి నమ్మకం లేకపోతే మరో విడత చర్చలకు ఎందుకు అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఈ దఫా చర్చల్లో తప్పకుండా ఓ పరిష్కారం లభిస్తుందని తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక, రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ, కనీస మద్దతు ధర అంశం, చట్టాల రద్దు అంశాలే తమ అజెండా అని, కానీ ప్రభుత్వం తమ పంతం నెగ్గాలన్న ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మూడు చట్టాల తొలగింపు తప్ప తాము మరేమీ కోరుకోవడంలేదని బల్బీర్ స్పష్టం చేశారు.

More Telugu News