నిలకడగా గుంగూలీ ఆరోగ్యం.. యాంజియోప్లాస్టీ వాయిదా!
- గంగూలీ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించిన వైద్య బృందం
- సమీక్షకు హాజరైన గంగూలీ భార్య, సోదరుడు
- ప్రస్తుతం ఐసీయూలో ఉన్న గంగూలీ
తొమ్మిది మంది డాక్టర్లతో కూడిన బృందం ఈ రోజు గంగూలీ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటనలో తెలిపారు. ఇప్పటికప్పుడు మరో యాంజియోప్లాస్టీ అవసరం లేదని... రెండు వారాల్లో యాంజియోప్లాస్టీని నిర్వహిస్తామని చెప్పారు. వైద్య బృందం సమీక్ష నిర్వహించిన సమయంలో వారితో పాటు గంగూలీ భార్య డోనా, సోదరుడు స్నేహాసిస్ గంగూలీ ఉన్నారు. ప్రస్తుతం గంగూలీ ఐసీయూలోనే ఉన్నారు.
గంగూలీ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో మూడు చోట్ల అడ్డంకులను గుర్తించింది. యాంజియోప్లాస్టీ నిర్వహించి ఓ దాన్ని తొలగించారు. ఎల్ఏడీ, ఓఎం2లకు మాత్రం రెండో దశలో యాంజియోప్లాస్టీ నిర్వహించాలని నిర్ణయించారు. గంగూలీకి మళ్లీ ఛాతీ నొప్పి రాకపోవడంతో తర్వాతి యాంజియోప్లాస్టీని వాయిదా వేశారు. మరోవైపు గంగూలీ కుటుంబసభ్యుల కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయించారు.