గణతంత్ర వేడుకలు ఎర్రకోటలో లేనట్టే... అతిథిగా బోరిస్ జాన్సన్ రాకపై సందిగ్ధత!

Covid Sanctions on Republic Day Parede
  • సాదాసీదాగా జరుగనున్న వేడుకలు
  • పరేడ్ లో పాల్గొనే బృందాల కుదింపు
  • 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేనట్టే
  • వీక్షకుల సంఖ్య 25 వేలకు పరిమితం
వచ్చే నెల 26న జరగాల్సిన గణతంత్ర దినోత్సవ వేడుకలను సాధ్యమైనంత సాదాసీదాగానే నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా, కొత్త స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై, వేడుకల విషయంలో భారీ మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటకు దూరంగా వేడుకలు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక పరేడ్ ను విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకూ మాత్రమే... అంటే 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించాలని, పరేడ్ లో పాల్గొనే బృందాల్లో ఉండే 144 మంది సభ్యులను 96కు కుదించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక విన్యాసాల్లో పాల్గొనే వారంతా మాస్క్ లను ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని కూడా పాటించాల్సి వుంటుంది. ఇదే సమయంలో ప్రతియేటా దాదాపు లక్ష మందికి పైగా వీక్షకులకు వేడుకలను చూసేందుకు అనుమతిస్తుండగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యను 25 వేలకు కుదించాలని కూడా అధికారులు నిర్ణయించారు.

ఈ వేడుకలకు 15 సంవత్సరాల్లోపు బాల బాలికలను అనుమతించరాదని, సాంస్కృతిక కార్యక్రమాలనూ కుదించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఇక ఈ సంవత్సరం వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే, బ్రిటన్ లో వచ్చిన కరోనా కొత్త రకం వైరస్, ఇండియాకూ అదే స్ట్రెయిన్ విస్తరించిన నేపథ్యంలో ఆయన పర్యటనపైనా సందిగ్ధత ఏర్పడింది.
Go Back to Shorts
Republic Day
India
Boris Johnsons
Guest

More Telugu News