మహిళా కమిషన్ బాధ్యతలను సునీతా లక్ష్మారెడ్డికి అప్పగించిన కేసీఆర్!

Sunitha Lakshmareddy is Now TS Womern Chair Person
  • ఆరుగురు సభ్యులతో కమిటీ
  • ఉమ్మడి ఏపీలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసిన సునీత
  • గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిక
తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా, ముగ్గురు కాంగ్రెస్ సీఎంల క్యాబినెట్ లో మంత్రిగా విధులు నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ, సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ లో సునీతతో పాటు కుమ్రు ఈశ్వరీ బాయి, సుధం లక్ష్మి, కటారి రేవతీరావు, షహీనా అఫ్రోజ్, ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ తదితరులు సభ్యులుగా ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం 2013లో ఏపీ మహిళా కమిషన్ కు త్రిపురాన వెంకటరత్నం చైర్ పర్సన్ గా ఉండగా, ఆపై రాష్ట్రం విడిపోయినా, ఆమే కొనసాగారు. 2018 తరువాత ఆమె పదవీకాలం ముగిసిపోగా, ఇంతవరకూ మరొకరిని ఎంపిక చేయలేదు.

సునీతా లక్ష్మారెడ్డి గతంలో వైఎస్ తో పాటు, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆమె సమర్ధతను గుర్తించిన కేసీఆర్, మహిళా కమిషన్ బాధ్యతలను అప్పగించారు.

ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ, తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలందరి హక్కులను పరిరక్షించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.
Go Back to Shorts
KCR
Sunitha Laxma Reddy
Women Commission
Chair Person

More Telugu News