deve gouda: మా పార్టీని నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది‌: దేవెగౌడ

  • సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రయత్నాలు 
  • కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి
  • మా పార్టీకి బలమైన మూలాలున్నాయి
  • మళ్లీ పార్టీ బలపడుతుంది
deve gouda slams congress

కర్ణాటకలోని తమ‌ పార్టీ జేడీఎస్‌ను నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత దేవెగౌడ ఆరోపణలు గుప్పించారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఈ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, తమ పార్టీకి బలమైన మూలాలున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జేడీఎస్ సొంతంగా నిలబడగలుగుతుందని,  2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. తాను ఉన్నంత కాలం మాత్రమే కాకుండా, తాను లేకపోయినా జేడీఎస్ ఉంటుందని తెలిపారు. తమ పార్టీలో విశ్వాసమున్న కార్యకర్తలు తమకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో తమ పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని, బీజేపీలో తమ పార్టీ‌ విలీనమవుతుందనే ప్రచారాలను కొందరు తమ సరదాకోసమే చేస్తున్నారని చెప్పారు. తమ పార్టీ ఎన్నటికీ బీజేపీలో విలీనం కాబోదని తెలిపారు. కాగా, ఇటీవల జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

More Telugu News