Ponnam Prabhakar: సొంత నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: పొన్నం ప్రభాకర్

  • ఢిల్లీకి వెళ్లినప్పుడు  రైతులను కేసీఆర్ ఎందుకు కలవలేదు
  • బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు యత్నిస్తున్నాయి
  • కేసీఆర్ అవినీతిపై బీజేపీ విచారణ జరిపించాలి
What Kishan Reddy is doing when Rohingyas are in his constituency asks Ponnam Prabhakar

హైదరాబాదులో రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో ఉన్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా రోహింగ్యాల ప్రస్తావనను బీజేపీ తీసుకొచ్చింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ను బలహీన పరిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

హైదరాబాదులో రోహింగ్యాలు ఉన్నారనే విషయం కిషన్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉంటే ఇంత కాలం ఏం చేస్తున్నారని నిలదీశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు రైతులను ఎందుకు కలవలేదని అన్నారు. నిజంగా కేసీఆర్ రైతుల పక్షపాతి అయితే... టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు... సీబీఐ చేత విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే కేసీఆర్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

More Telugu News