Corona Virus: కల్లుతో కరోనా మాయం.. విస్తుపోయే వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేత

  • గంగానది కంటే కల్లు స్వచ్ఛమైనవి
  • కల్లు తాగితే కొవిడ్‌కు దూరంగా ఉండొచ్చు
  • రాజ్‌భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారు
BSP leader recommends toddy to prevent corona virus

కరోనా టీకా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కల్లుతో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బీఎస్పీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడైన భీమ్ రాజ్‌భర్ బల్లియా జిల్లా రాస్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కల్లుకు రోగ నిరోధక శక్తి ఉందని, ఇది గంగానది కంటే స్వచ్ఛమైనదని పేర్కొన్నారు. కల్లును ఎక్కువగా తాగడం వల్ల కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజ్‌భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారని చెప్పిన ఆయన.. కల్లు తాగితే కొవిడ్ నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఇటీవల ఓ బీజేపీ నేత గోమూత్రానికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని, ప్రతి రోజు దానిని తీసుకోవడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఎస్పీ నేత ఓ అడుగు ముందుకేసి కల్లు తీసుకుంటే కరోనా ఖతం అని పేర్కొన్నారు.

More Telugu News