Ram Gopal Varma: మిర్యాలగూడ నడి రోడ్డుపై రేపు వర్మ ప్రెస్ మీట్!

  • ఈ నెల 24న విడుదల కాబోతున్న 'మర్డర్'
  • ప్రణయ్ హత్య కథాంశంతో తెరకెక్కిన చిత్రం
  • అక్కడే ఎందుకు పెట్టేది రేపే చెబుతానన్న వర్మ
Ram Gopal Varma to conduct press meet tomorrow at Miryalaguda

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. తాజాగా వర్మ 'మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న ప్రణయ్ హత్య కేసు కథాంశంతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో, ఈ సినిమాపై వివాదం నెలకొంది. ఈ సినిమాను ఆపాలంటూ అమృత కోర్టు మెట్లెక్కారు. అయితే, సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది.

తన సినిమా విడుదలయ్యే సమయంలో సాధారణంగానే వర్మ హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక వివాదాన్ని రేపి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి. 'మర్డర్' సినిమా రిలీజ్ నేపథ్యంలో కూడా వర్మ మరో సంచలనానికి తెరతీశారు. రేపు మిర్యాలగూడలోని నటరాజ్ థియేటర్ రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది మారుతీరావుకు చెందిన కథ కాదని... ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన చిత్రమని తెలిపారు. అసలు విషయం తెలియకే అమృత కోర్టుకు వెళ్లారని చెప్పారు. తమ కుటుంబ గౌరవాన్ని చెడగొడుతున్నారనే భావోద్వేగాలు ఉండటం మానవ సహజమని అన్నారు. మిర్యాలగూడలోనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకున్నానో రేపే చెబుతానని తెలిపారు.

More Telugu News