SEC: ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ

  • ఎన్నికలకు ప్రభుత్వం సహకరించడంలేదని ఆరోపణ
  • హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదని అసంతృప్తి
  • సీఎస్ స్పందన తీరు సరిగాలేదని వెల్లడి
  • ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ వినతి
SEC files contempt of court petition against AP Government

ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో రమేశ్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ రాసిన లేఖపైనా ప్రభుత్వం స్పందించలేదని, సీఎస్ స్పందన కూడా సరిగా లేదని తన తాజా పిటిషన్ లో తెలిపారు.

ఎన్నికల విషయంలో తాము ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ముందుకు వెళుతున్నా గానీ, ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నికలు జరపడం కుదరదని చెబుతోందని ఎన్నికల సంఘం ఆరోపించింది. ఎన్నికలు సాఫీగా జరిగేలా ఏపీ సర్కారుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News