Kerala: కేరళలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపుపై బీజేపీ ఆశలు

  • మూడు విడతలుగా ఎన్నికలు
  • పలు జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు
  • దూసుకుపోతున్న ఎల్డీఎఫ్
 Kerala local body polls counting begins

కేరళ స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. మూడు దశలుగా ఎన్నికలు జరగ్గా, తుది విడతలో రికార్డు స్థాయిలో 78.64 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కేరళలో పాగావేయాలని చూస్తున్న బీజేపీ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించింది. మొత్తం 941 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 244 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మలప్పురం, కోజికోడ్‌, కసర్‌గఢ్ జిల్లాల్లో కొన్ని చోట్ల 144 సెక్షన్ విధించారు.  ఈనెల 22 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిషేధం అమల్లో ఉంటుంది. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఎల్‌డీపీ, విపక్ష యూడీఎఫ్, బీజేపీ మధ్యే ఉంది.

ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. ఎల్డీఎఫ్ 361 స్థానాలు, యూడీఎఫ్ 311 స్థానాలు, ఎన్‌డీఏ 32, ఇతరులు 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, గత ఎన్నికల్లో ఎన్డీయే 14 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత తీరు చూస్తుంటే ఎన్డీయే స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News