BJP: తీరుమారని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. వరుస వివాదాస్పద వ్యాఖ్యలు

  • ప్రధాని మందలించినా మారని తీరు
  • శూద్రులు అజ్ఞానులని వ్యాఖ్య
  • మమత బెనర్జీకి పిచ్చెక్కిందంటూ ఫైర్
BJP MP Pragya Thakur shocking comments

వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోమారు వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే బాధపడరని, బ్రాహ్మణులను బ్రాహ్మణులని అంటే వారు చింతించరని, వైశ్యులను వైశ్యులని పిలిస్తే బాధపడరని, కానీ శూద్రులను మాత్రం శూద్రులని అంటే తెగ బాధపడిపోతారని, ఎందుకంటే వారు అజ్ఞానులని ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

2008 మాలేగావ్  పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రగ్య నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది మేలో ప్రధాని నరేంద్రమోదీ మందలించినప్పటికీ ఆమె వైఖరిలో మార్పులేదనడానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనం.

మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపైనా ప్రగ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు  పిచ్చెక్కిందని అన్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ మమతపై దుమ్మెత్తిపోశారు. ఆమె (మమత)కు పిచ్చెక్కిందని వ్యాఖ్యానించారు.

‘‘ఇది పాకిస్థాన్ కాదు, భారత్ అని ఆమె అర్థం చేసుకున్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు హిందువులు సిద్ధమయ్యారు. వారు ఆమె (మమత)కు గట్టి సమాధానం ఇస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. బెంగాల్‌లో హిందూరాజ్యం వస్తుంది’’ అని అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె పూర్తిగా నిరాశలో ఉన్నారు. ఆమెకు తెలుసు తన పాలనకు తెరపడుతుందని. ఆమెకు పిచ్చెక్కింది’’ అని మమతపై దుమ్మెత్తి పోశారు.

More Telugu News