శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన కేంద్రమాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్

Harsimrat Kaur admitted to PGI after she complains of breathlessness
  • చండీగఢ్‌లోని పీజీఐలో చేరిన మాజీ మంత్రి
  • ప్రస్తుతం నిలకడగానే ఆరోగ్యం
  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబరులో మంత్రి పదవికి రాజీనామా
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (పీజీఐ)లో చేరిన ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆమెను ఐసీయూ వార్డులోని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతులకు మద్దతుగా ముందుకొచ్చిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, హర్‌సిమ్రత్ మామ ప్రకాశ్ సింగ్ బాదల్ తన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. కాగా, మోదీ కేబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసిన హర్ సిమ్రత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది సెప్టెంబరులో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది.
Go Back to Shorts
Harsimrat Kaur Badal
PGI
Chandigarh
Covid-19
SAD

More Telugu News