USA: యూఎస్ ఎన్నికల్లో కుట్ర లేదు: అటార్నీ జనరల్ స్పష్టీకరణ

  • కుట్రలకు ఎటువంటి ఆధారాలూ లేవు
  • తామేమీ మోసాలను గుర్తించలేదన్న బిల్ బ్రార్
  • అయినా ఇంకా పట్టువీడని ట్రంప్
No Fruad in US Elections says Atorney General

గత నెల ప్రారంభంలో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎటువంటి కుట్ర జరిగిందనడానికి ఆధారాలు లేవని యూఎస్ అటార్నీ జనరల్ బిల్ బ్రార్ స్పష్టంచేశారు. ఓట్ ఫ్రాడ్ జరిగిందని పదేపదే రిపబ్లికన్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వారి వ్యాఖ్యలను బ్రార్ తిరస్కరించారు. "ఎన్నికల ఫలితాలను సమూలంగా మార్చగలిగే మోసం జరిగిందనడానికి తగిన ఆధారాలను ఇంతవరకూ గుర్తించలేదు" అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

బ్రార్ వ్యాఖ్యలతో తన ఓటమిని గౌరవంగా అంగీకరించి, వైట్ హౌస్ ను ఖాళీ చేసి, బైడెన్ గెలుపును స్వాగతించేలా డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ ఇంటెలిజెన్స్, స్వతంత్ర ఎన్నికల నిఘా సంస్థలు, 2020 ఎన్నికలు పకడ్బందీగా జరిగాయన్న నిర్ణయానికి వచ్చేశాయి.

అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం మిచిగన్, పెన్సిల్వేనియా, జార్జియా రాష్ట్రాల్లో తప్పుడు పద్ధతుల్లో ఓట్లు వేశారని, ఈ కారణంగానే తాను రెండోసారి అధ్యక్షుడిని కాలేకపోయానని ఆరోపించినా, అందుకు సహేతుకమైన సాక్ష్యాలను బయట పెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మంగళవారం కూడా ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు. అమెరికాను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తీరును విమర్శిస్తూ, కోర్టులను ఆశ్రయించినా, ఎక్కడా కూడా అనుకూలంగా తీర్పు వెల్లడి కాలేదు.

More Telugu News