KCR: కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం: కేసీఆర్

We are ready to distribute Corona vaccine to people says KCR
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలకు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే వ్యాక్సిన్ వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనాపై ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు. అయితే, శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సి ఉందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు.

కరోనా వైరస్ దేశంలోని అన్ని ప్రాంతాలపై ఒకే విధమైన ప్రభావం చూపలేదని కేసీఆర్ చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రానికి కొన్ని వ్యాక్సిన్ డోసులను పంపాలని... వాటిని కొంత మందికి ఇవ్వాలని... 10, 15 రోజులు పరిస్థితిని పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని సూచించారు.

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు కోల్డ్ చైన్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్లు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నవారికి ఇవ్వాలని అన్నారు. దీని కోసం పూర్తి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Go Back to Shorts
KCR
TRS
Corona Virus
Vaccine

More Telugu News