New Delhi: 76 మంది తప్పిపోయిన చిన్నారులను వెతికిపట్టుకున్న మహిళా పోలీసు... అరుదైన గుర్తింపునిచ్చిన అధికారులు!

  • అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చిన అధికారులు
  • ఆమె సేవలు నిరుపమానం అంటూ పొగడ్తలు
  • ఎంత అభినందించినా తక్కువేనన్న ఢిల్లీ సీపీ ఎస్ఎన్ శ్రీవాత్సవ

ఢిల్లీ పోలీసు చరిత్రలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. తన ప్రతిభతో కనిపించకుండా పోయిన 76 మంది ఆచూకీని కనిపెట్టిన సీమా ఢాకా అనే మహిళా పోలీసు అధికారికి నిబంధనలు పక్కన బెట్టి, ప్రమోషన్ అందించారు. కానిస్టేబుల్ గా ఉన్న ఆమెను, హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని సమయ్ పూర్ బాడ్లీ పోలీసు స్టేషన్ లో ఆమెను నియమించామని, ఓటీపీ (అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్) ఓ మహిళకు దక్కడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.

ఎవరైనా తప్పిపోయినట్టు ఫిర్యాదు అందగానే, రంగంలోకి దిగే సీమ, ఇప్పటివరకూ 76 మంది ఆచూకీని కనిపెట్టడంలో విజయం సాధించారు. అందులో 56 మంది 14 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. ఆమె సేవలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం ఆమెను ప్రత్యేకంగా పిలిపించి, మిస్సింగ్ కేసులను అప్పగించాయి.

ఆమె సేవలను గుర్తించిన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ, "ఆమెను ఎంత అభినందించినా తక్కువే. ప్రత్యేక ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఆమెకు ప్రమోషన్ ఇచ్చాము. ఆమె ధైర్య సాహసాలకు ఈ గుర్తింపు తక్కువే. ఎంతో మంది కుటుంబాల్లో ఆమె సంతోషాన్ని నింపారు" అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సీమా ఢాకాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ కానిస్టేబుల్ గా ఆమె ఢిల్లీ పోలీసు విభాగానికి అందించిన సేవలు ఎంతో విలువైనవని, ఏళ్ల క్రితం తప్పిపోయిన వారిని సైతం ఆమె క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారని, ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పొగిడారు.

More Telugu News