Telangana: తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో నీటిలో మునిగి ఆరుగురు గల్లంతు.. ముగ్గురి మృతి

  • ములుగు, కామారెడ్డి జిల్లాల్లో  ఘటన
  • ములుగు జిల్లాలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
  • కామారెడ్డిలో ఒకరి మృతి, కొనసాగుతున్న గాలింపు
Six teenagers missing in telangana

దీపావళి పండుగ నాడు తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు యువకులు నీటిలో పడి గల్లంతయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాల వద్ద గోదావరిలో ఈతకు వెళ్లిన తుమ్మ కార్తీక్, అన్వేష్, శ్రీకాంత్, రాయవరపు ప్రకాశ్‌లు ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో రాయవరపు ప్రకాశ్, తుమ్మ కార్తీక్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరో ఘటనలో కామారెడ్డి జిల్లా కల్లేరు మండలానికి చెందిన ఇద్దరు నిజాం సాగర్ ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. మండలానికి చెందిన సునీర్, శివ, బాలరాజు, మన్నన్, ప్రశాంత్‌ కలిసి నిజాంసాగర్ డ్యామ్‌ను చూసేందుకు వెళ్లారు. అనంతరం వరద గేట్ల సమీపంలో ఒడ్డున స్నానం చేస్తుండగా, శివ, సునీర్‌లు కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరిలో సునీర్ మృతదేహం లభ్యమైంది. శివ కోసం గాలిస్తున్నారు.

More Telugu News