Ayyanna Patrudu: ఇష్టం వచ్చినట్టు మార్చడానికి పోలవరం విజయసాయి ఇంటి ప్రహరీకాదు: అయ్యన్న పాత్రుడు

  • పోలవరం నేపథ్యంలో ధ్వజమెత్తిన అయ్యన్న
  • ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించబోమని హెచ్చరిక
  • విశాఖను విజయసాయి దోపిడీ చేస్తున్నాడని ఆరోపణ
Ayyanna Patrudu comments on Vijayasai Reddy

సీఎం కేసీఆర్ మాటలు విని ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టు మార్పులు చేయడానికి పోలవరం విజయసాయి ఇంటి ప్రహరీకాదని స్పష్టం చేశారు.

విశాఖను విజయసాయి దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే విశాఖ అభివృద్ధి అని స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన విజయసాయిరెడ్డి విశాఖలో నిర్వహించిన వాకథాన్ లో మాట్లాడిన మాటలు హాస్యాస్పదం అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

విశాఖ ఎంతో అందమైనదని, ఆ నగరాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని విజయసాయి చెప్పడం చూస్తుంటే ఓ సినిమాలో నెల్లూరు పెద్దరెడ్డి మేనల్లుడి పాత్రలో బ్రహ్మానందం పలికిన డైలాగులు గుర్తొస్తున్నాయని అన్నారు. విశాఖను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే ఎవరూ నమ్మరని అయ్యన్న వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేస్తున్నామంటూ విశాఖలోని గీతం విద్యాసంస్థల నిర్మాణాలు కూలగొట్టింది ఎవరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News