Killi Kruparani: అది రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెల్లుతుంది: కిల్లి కృపారాణి

  • ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రనే మలుపుతిప్పింది
  • ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం చాలా అరుదు
  • రామరాజ్యాన్ని జగన్ నిర్మించారు
That greatness goes to only YSR family says Killi Kruparani

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రనే మలుపుతిప్పిందని వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్రలు చేయడం దేశ చరిత్రలోనే అరుదని చెప్పారు. ఆ ఘనత రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెల్లిందని అన్నారు. పాదయాత్ర తర్వాత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. రాష్ట్రంలో రామ రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే గొప్ప సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వంగా వైసీపీ నిలిచి పోతుందని చెప్పారు.

మరోవైపు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నిలబెట్టుకున్నారని కితాబునిచ్చారు. అన్ని వర్గాల వారిపై ఆయన చూపుతున్న అభిమానం ఆయనను చిరకాలం ముఖ్యమంత్రిగా నిలబెడుతుందని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన 'నేను విన్నాను.. ఉన్నాను' అనే నినాదం రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిందని అన్నారు. త్వరలోనే భావనపాడు పోర్టును పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాల విభజనలో ఎచ్చర్ల ప్రాంతాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News