UAE: చైనా తయారీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు

  • ‘సినోఫార్మ్’ను అభివృద్ధి చేసిన చైనా ప్రభుత్వ కంపెనీ
  • మూడో దశ ప్రయోగాల్లో ఉండగానే అత్యవసర వినియోగానికి యూఏఈ అనుమతి
  • రాజుతోపాటు విదేశాంగ మంత్రి, ఉప ప్రధానికి కూడా వ్యాక్సినేషన్
UAE prime minister receives coronavirus vaccine shot

దాదాపు ఏడాది కావస్తున్నా కరోనా మహమ్మారి భయం మాత్రం ప్రపంచాన్ని ఇంకా వీడలేదు. యూరప్ దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ కనిపించడంతో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించాయి. మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. వ్యాక్సిన్ రాక ఇంకా వార్తలకే పరిమితమైన వేళ.. చైనా ప్రభుత్వానికి చెందిన ఫార్మా కంపెనీ ‘సినోఫార్మ్’ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం వేయించుకున్నారు. టీకా వేయించుకుంటుండగా తీసిన ఫొటోను నిన్న ట్విట్టర్‌లో షేర్ చేశారు.

నిజానికి ఈ టీకా ప్రస్తుతం మూడో దశ పరీక్షల్లో ఉన్నప్పటికీ అత్యవసర ప్రాతిపదికన దుబాయ్ దీనిని వినియోగిస్తోంది. రాజుతోపాటు దుబాయ్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని కూడా టీకాను వేయించుకున్నారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరికీ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం యూఏఈలో ఇప్పటి వరకు 1,35,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 497 మంది మృత్యువాత పడ్డారు.

More Telugu News