Telangana: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 922 కేసుల నమోదు
  • ఏడుగురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్‌గా 17,630 కేసులు
Corona cases in Telangana raised to 240970

గత కొన్ని రోజులతో పోలిస్తే తెలంగాణలో నిన్న కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్న రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 922 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,970కి చేరుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొంది. కరోనా కారణంగా నిన్న ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,348కి పెరిగింది. అలాగే, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,456 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్న వారి సంఖ్య2,21,992కు పెరిగింది.

రాష్ట్రంలో ఇంకా 17,630 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వారిలో 14,717 మంది ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక నిన్న వెలుగు చూసిన 922 కేసుల్లో 256 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 25,643 నమూనాలు పరీక్షించారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 43,49,309కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

More Telugu News