Saifullah Mir: శ్రీనగర్ లో హిజ్బుల్ ముజాహిదిన్ చీఫ్ హతం

  • జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలకు భారీ విజయం
  • రంగ్రెథ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్
  • భద్రతా బలగాలను చూసి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
Hizbul Mujahideen operational chief Saifullah Mir killed in encounter

జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ ఆపరేషనల్ చీఫ్ డాక్టర్ సైఫుల్లా మీర్ ను హతమార్చాయి. ఇవాళ శ్రీనగర్ లో జరిగిన ఓ భీకర ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు  సైఫుల్లాను మట్టుబెట్టాయి. దీనిపై కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. రంగ్రెథ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో సైఫుల్లా మరణించాడని, మరో మిలిటెంట్ ను సజీవంగా పట్టుబడ్డాడని తెలిపారు.

ఈ ఉదయం రంగ్రెథ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాయి. ఓ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలు తమను సమీపిస్తుండడంతో కాల్పులు ప్రారంభించారు. దాంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో హిజ్బుల్ ముజాహిదిన్ అగ్రనేత సైఫుల్లా మరణించాడు.

పుల్వామాలోని మలంగ్ పురా ప్రాంతానికి చెందిన సైఫుల్లా 2014లో హిజ్బుల్ ఉగ్రమూకలో చేరాడు. అతడిని ఘాజీ హైదర్ అని, డాక్టర్ సాబ్ అని పిలుస్తుంటారు. ఈ ఏడాది మే నెలలో రియాజ్ నాయికూ హతమైన తర్వాత అతడి స్థానంలో సైఫుల్లా హిజ్బుల్ బాధ్యతలు చేపట్టాడు.

More Telugu News