Bandi Sanjay: దుబ్బాకలో కాషాయ జెండా ఎగరడం ఖాయం... సీఎం తాత వచ్చినా బీజేపీ విజయం ఆగదు: బండి సంజయ్

  • దుబ్బాకలో ఉప ఎన్నికల వేడి
  • ఈ ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదన్న సీఎం కేసీఆర్
  • కేసీఆర్ అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలన్న సంజయ్
Bandi Sanjay confidant about BJP victory in Dubbaka

దుబ్బాక ఉప ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రధాన రాజకీయ పక్షాలు విమర్శల దాడుల్లో తీవ్రతను పెంచాయి. దుబ్బాక ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదని, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు ఎప్పుడో ఖాయమైందంటూ సీఎం కేసీఆర్ విపక్షాల ప్రభావాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీటుగా స్పందించారు. సీఎం తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గంపై కాషాయజెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రోజురోజుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సర్వేలు మొత్తం తమకే అనుకూలంగా ఉన్నాయని సంజయ్ వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న రఘునందన్ రావుతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఓ పాస్ పోర్టుల బ్రోకర్ అని, నిరుద్యోగులను ముంచి కోట్లు సంపాదించారని ఆరోపించారు.  టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయాలని అన్నారు రఘునందన్ గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్లపైనే ఉంటుందని, ప్రతి ఇంటికి రెండు పెన్షన్లు ఎందుకివ్వరని ప్రశ్నించారు.

More Telugu News