Chiranjeevi: మరో తమిళ రీమేక్ పై కన్నేసిన చిరంజీవి!

  • రీమేక్ సినిమాలపై మన హీరోల నమ్మకం
  • 'లూసిఫర్', 'వేదాళం' రీమేక్ లు చేస్తున్న చిరు  
  • అజిత్, గౌతమ్ మీనన్ కలయికలో వచ్చిన 'ఎన్నై అరిందాల్'  
  • 'ఎన్నై అరిందాల్' రీమేక్ పై ఆలోచిస్తున్న మెగాస్టార్
Chiranjivi eyes on another Tamil remake

రీమేక్ చిత్రాలంటే కొంత గ్యారంటీ ఉంటుంది. ఒక భాషలో అప్పటికే హిట్టయిన సినిమా కాబట్టి అక్కడ ఫలితం తెలిసిపోయింది కాబట్టి, ఆ సినిమాపై కొంత నమ్మకం ఉంటుంది. అందుకే, మన హీరోలు రీమేక్ లంటే మక్కువ చూపిస్తూవుంటారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి కూడా అలాగే ఇప్పటికే రెండు రీమేక్ చిత్రాలను లైన్లో పెట్టారు.

వీటిలో ఒకటి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' కాగా, తమిళంలో హిట్టయిన 'వేదాళం' మరొకటి. ఇక 'లూసిఫర్'కు వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, 'వేదాళం'కి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండూ కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో చిరంజీవి మరో రీమేక్ మీద కూడా కన్నేసినట్టు తెలుస్తోంది.

2015లో అజిత్ హీరోగా తమిళంలో 'ఎన్నై అరిందాల్' అనే సినిమా వచ్చింది. బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడీ చిత్రం పట్ల మెగాస్టార్ మక్కువ చూపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ చిరంజీవి కనుక దీనిని రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకుంటే, తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన ఏ.ఎం.రత్నం ఈ తెలుగు చిత్రాన్ని కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

More Telugu News