Thief: చెన్నైలో వింత దొంగ... సీసీటీవీ ఫుటేజి చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు

  • మరుండేశ్వర్ ఆలయంలో దోపిడీ
  • హుండీ పగులగొట్టి సొమ్మంతా ఎత్తుకెళ్లిన దొంగ
  • దోపిడీకి ముందు ప్రార్థనలు
  • హుండీలో డబ్బులు కూడా వేసిన వైనం
Thief offered prayers and looted hundi at the temple

దొంగతనం నేరం. అయితే కొన్ని సందర్భాల్లో దొంగలు చేసే చేష్టలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి, నవ్వు పుట్టిస్తుంటాయి. ఈ చెన్నై దొంగ కూడా అలాంటివాడే. దేవాలయంలో చోరీకి వచ్చి హుండీలో డబ్బులు వేసి, తిరిగి అదే హుండీని దోచుకున్నాడు. ఇటీవల తమిళనాడులోని తిరువనమియూర్ ప్రాంతంలోని మరుండేశ్వర్ ఆలయంలో దోపిడీ జరిగింది. ఆలయం తెరిచిన పూజారులు హుండీ బద్దలై ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ నేరుగా వెళ్లి దేవతా విగ్రహాల ముందు నిల్చుని భక్తితో ప్రార్థనలు చేయడం, ఆపై హుండీలో డబ్బులు కూడా వేయడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. ఆ తర్వాత ఓ రాడ్ తీసుకుని హుండీ పగులగొట్టి తాను వేసిన డబ్బుతో సహా అందులోని సొమ్ము అంతా తీసుకుని అక్కడ్నించి పరారయ్యాడు. ఆ యువకుడు మాస్కు ధరించి ఉన్నట్టు గుర్తించారు. దొంగ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News