పంజాబ్ లో శౌర్యచక్ర అవార్డు గ్రహీతను కాల్చి చంపిన దుండగులు
- తరన్ తరన్ జిల్లాలో ఘటన
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం
- ఘటనపై దర్యాప్తు కోసం సిట్ నియామకం
ఈ ఉదయం ఏడింటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బల్వీందర్ నివాసంలోకి చొరబడి అత్యంత సమీపం నుంచి గుళ్ల వర్షం కురిపించారు. దాంతో ఆయన సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ హత్యోదంతంపై సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, 1990లో బల్వీందర్ సింగ్ పేరు మార్మోగిపోయింది. దాదాపు 200 మందితో కూడిన టెర్రరిస్టు మూక ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆ సమయంలో బల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు, వారి భార్యలు అత్యంత తెగువతో ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. దాదాపు ఐదు గంటల సేపు జరిగిన ఆ పోరాటంలో పిస్టళ్లు, స్టెన్ గన్లతోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. చివరికి టెర్రరిస్టులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు తోకముడిచారు. ఈ ఘటన నాడు బల్వీందర్ సింగ్, ఆయన కుటుంబానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది.